“స్పృహ”
తెలుగు కథాకన్యకకి కొత్తకొత్త సొగసులద్ది, ముస్తాబు చేసి, సర్వాలంకార భూషితని చేయడంలో ఎందరో కథకులు తమ కలాలను కలిపేరు. అందరూ కలిసి తమతమ కథా ప్రసూనాలతో అందంగా తీర్చిదిద్ది, ముచ్చటగా మన ముంగిట్లో కూర్చోబెట్టారు. ” సాహిత్యంలో ఏ ప్రక్రియా చేయలేని సేవ కథ చేసింది” అని ప్రముఖ రచయిత గోపీచంద్ గారన్న మాట ఇక్కడ ఓసారి తలచుకోవాలి.
1962 లో ప్రారంభించి, పదికి పైగా కథా సంపుటాలు వెలువరించి, ఇప్పటికీ ఇంకా అదే జోరుతో కథలు రాయడంలో వీర విహారం చేస్తూన్న వారు–ప్రసిద్ధ కథా రచయిత ‘ విహారి‘ గారు. వాసిలోనూ రాశిలోనూ కూడా వారు పేరెన్నిక గన్నవారు.
విహారి గారి అసలు పేరు జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి. ‘అక్షరం‘ ‘ గుండెలో కోయిల‘ ‘గోరంత దీపం‘ ‘ బొంగరం‘ ‘స్పృహ‘ మొదలైన కథా సంపుటాలు వీరు వెలువరించారు. కథలో క్లుప్తత చాలా ముఖ్యమని వీరి భావన.
ఇప్పుడు విహారి గారు రాసిన “స్పృహ” అనే కథ చదువుదాం.
👇👇👇👇👇👇
విశ్వానిది ఒక విచిత్రమైన జీవితం. అన్నీ అందినట్టే అంది జారిపోతున్నట్టుగా ఉంటాయి. ” క్షణక్షణం జీవితం నాతో దోబూచులాడుకుంటుంది. అడుగడుక్కీ దాన్ని పట్టుకుందామనుకుంటే
— అది నన్ను మొట్టి పరిగెత్తుకు పోతుంది” అని అనుకుంటూంటాడు. సినిమా టికెట్ల క్యూలో నించుంటే సరిగ్గా అతని దగ్గరకొచ్చేసరికి కౌంటర్ క్లోజ్ అయిపోతుంది.పేకాటలో కూచుంటే పన్నెండు ముక్కలే పండుతాయి కానీ, ఎంతకీ ఎక్స్ టెన్షన్ అంది చావదు. పుట్టినప్పటినుంచీ అంతే! అతని తల్లి రూపమే అతనికి తెలీదు. అసలు పుట్టడమే ఏదో కొంప మునిగిపోయినట్టు ఏడో నెల్లోనే తల్లి ప్రాణం తీసి మరీ ఈ లోకంలోకి తన్నుకొచ్చాడు. అన్నింటిలోనూ ‘తరుగు’… ఎప్పుడూ ఏదో వెలితి. ” అసలు నీ తరుగంతా నీ కుడికాల్లోనే ఉంది.” అని అతని ఎడమ కాలు కంటే అరంగుళం కురచైన కుడికాలు గురించి అతని మిత్రుడు సత్యం అంటూండే వాడు.
విశ్వం ఎస్. ఎస్. ఎల్. సి. లో ఒక్క మార్కులో స్కూల్ ఫస్టు పోగొట్టుకున్నాడు. దాంతో, స్కూల్ ఫస్టు వచ్చిన వాళ్ల పేర్లు రాసి, ఏళ్ల తరబడి వెళ్ళాడదీసే బోర్డు మీద తన పేరు బదులు రమాకాంత్ పేరు రాశారు. ఇతను కుళ్ళి కుళ్ళి ఏడిచాడు. అలాగే బి. ఏ లో 600 కీ 359 మార్కులు ఇచ్చి, (సరిగ్గా ఒక్క మార్కు తక్కువ–ఫస్టు క్లాస్ కి.) ఫస్టు క్లాసు అన్నావంటే తంతామన్నట్టుగా హెచ్చరించారు. ఓ మంచి కంపెనీలో ఉద్యోగం కోసం పరీక్ష రాసి, ఇంటర్వ్యూలో నెగ్గి, 21వ స్థానంలో నిలిచాడు. 20 మంది వరకూ తీసుకుని. లిస్టు ముగించారు! కాకపోతే ఒక్కటి మాత్రం జరిగింది. అతను గుమాస్తా ఉద్యోగానికి, టైపిస్ట్ ఉద్యోగానికీ కలిపి ఉన్న పరీక్ష (కంబైన్డ్ ఎగ్జామ్) రాస్తే, టైపిస్టుగా సెలెక్ట్ చేసి, అతని పేరుని వెయిటింగ్ లిస్టులో ఉంచారు. ఉద్యోగంలో చేరాల్సిన వాళ్ళలో ఒకతను హఠాత్తుగా పాము కరిచి పోయాట్ట.. దాంతో విశ్వానికి వచ్చిందా ఉద్యోగం! అతన్ని అభినందిస్తూ, “తరుగులో మెరుగంటే ఇదే!” అన్నాడు సత్యం. “ఇకనుంచీ నీ జాతకం మారుతుంది చూసుకో….” అని కూడా అన్నాడు.పాపం సత్యం ఆశాజీవి ! తీరా ఆఫీసులోకెళ్తే, అందరికీ గాద్రెజ్ టేబుళ్ళూ, కుర్చీలు.., విశ్వానికి మాత్రం ఇక్ష్వాకుల కాలంనాటి చెక్కకుర్చీ,టేబులూ, పాత ‘అండర్ వుడ్ ‘ టైపు రైటరూను. అందర్లోకీ జూనియర్ కనక అతనికంతేనట. ఇలా ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు ఏదో వెలితి.
విశ్వానికి నలుగురు మావయ్యలు. చిన్నప్పటి నుంచీ పెద్ద మావయ్యే పెంచాడు. ఆయన మూడో కూతురు సావిత్రి అంటే ఇతనికి ఇష్టం. ఆమెను పెళ్ళి చేసుకోవాలనే కోరికుండేది. కాని పెద్ద మావయ్య ఒక డాక్టర్ సంబంధం ఆమెకు ఖాయం చేశాడు. దాంతో ఇతగాడు తన కోరికని నొక్కి పెట్టేశాడు. అంతే కాదు ఆ మావయ్య నాలుగో కూతురు రమని చేసుకోమన్నాడు. విశ్వం తలూపకపోయినా, పెళ్ళి జరిగిపోయింది. కాపురం పెట్టేకా అతను సాయంత్రాలు షికారుకి వెళ్దామంటే, రమ తను హిందీ పరీక్షలకి చదువుకుంటాననేది. మొత్తానికి ఆమె కష్టపడి ప్రవీణ ప్యాసయ్యింది. మునిసిపాలిటీ వారి స్కూల్లో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టింది. విశ్వం కొంత అప్పుచేసి అంతో ఇంతో ముడుపు చెల్లించుకున్నాడు. తీరా చివరి క్షణంలో ఒక పోస్ట్ తగ్గించవలసి వచ్చి ‘ఈమెకు ఇవ్వడం కుదరలేదు.. వచ్చేసారి తప్పకుండా చేస్తా’మన్నారు.
తొలి చూలు మగపిల్లవాడైతే త్వరగా చేతికి అంది వస్తాడు కదా అనుకున్నాడు. ఆడపిల్ల పుట్టింది. టైపిస్టు నుంచి గుమాస్తాగా మార్పు వచ్చి అతన్ని హైదరాబాద్ బదిలీ చేశారు. అయినా అతనికి జీవితంలో పెద్ద మార్పు రాలేదు. ఎప్పుడైనా పాలబూత్ కి రమ వెళ్లకుండా అతను వెళ్తే, ఆరోజు పాలు లేనట్టే. అతని వంతు వచ్చేసరికి ‘ క్యాన్ ‘ ఖాళీ అయ్యేది. చివరికి కూతురి పుట్టు వెంట్రుకలు తీయించడానికి తిరుపతి వెళ్తే ,అక్కడ కూడా సత్రం గదులకీ , దర్శనానికీ ఆఖరి క్షణం వరకూ ఏదో సమస్యే. అలా జీవితం ఏదో ‘తరుగు’ తోనే జరిగిపోతోంది.
ఇలా ఉండగా ఒకరోజు అతని పెద్దమామయ్యకి ఆరోగ్యం బాగోలేదని, ఆసుపత్రిలో చేర్చారని వార్త వచ్చింది. రమ కన్నీళ్లు పెట్టుకుంది. విశ్వం ఆఫీసుకెళ్ళి, మేనేజర్ని సెలవు కావాలని అడిగితే,
ఆఫీసరు ఇతని సెలవు చీటీ పక్కన పెట్టి,ఓ టెలిగ్రాం చూపించాడు– ఆ మర్నాటి నుంచి ‘స్పెషల్ ఆడిట్ ‘ ఉందని. కనక సెలవు ఇవ్వలేదు. రమ కూతుర్ని తీసుకుని బందరు వెళ్లిపోయింది. బందరు నుంచి రమ టెలిగ్రాం ఇచ్చింది– ఆమె తండ్రికి చాలా సీరియస్ గా ఉందనీ, వెంటనే రమ్మనీ. విశ్వం ఏదో బస్ పట్టుకుని మర్నాటి ప్రొద్దుటకి అతి కష్టం మీద విజయవాడ చేరేడు. మంచి వేసవికాలం. ఆరోజు పెళ్లి ముహూర్తాలు చాలా ఉన్నాయిట. బస్ స్టాండులో నిలబడడానికి కూడా ఖాళీ లేదు. బస్సులేవీ సమయానికి నడవడం లేదు సరికదా..వచ్చిన బస్సుల్లో దూరడం అతని వల్ల కావడం లేదు. ఎలాగోలాగ ఎప్పటికో ఎవడో వెనకనుంచి గెంటితే బస్సులో పడి అతను బందరు వెళ్లేసరికి అక్కడ అంతా అయిపోయింది. తండ్రిలా పెంచిన మామయ్యని కడసారి చూసుకోలేదనే అతని బాధ కంటే, బంధువుల సూటి పోటి మాటలు అతన్ని ఎక్కువ బాధించాయి. అతని దురవస్థని సత్యం ఒక్కడే నమ్మేడు.” నువ్వు ఎక్కవలసిన రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు” అన్న కవి వాక్కు నీ పట్ల అక్షరాలా అన్వయిస్తుంది ” అన్నాడు.
కాలం గడిచిపోతోంది. నెలలు సంవత్సరాలుగా మారుతున్నాయి. విశ్వానికి ఇంకో ముగ్గురు అమ్మాయిలు పుట్టేరు. యథాప్రకారం అతను అడుగు ముందుకు వేస్తే ఆరడుగులు వెనక్కి లాగుతూనే ఉంది జీవితం. అతనిని విశాఖపట్నం బదిలీ చేశారు. విశాఖలో విశ్వానికి తన ఆఫీసులో సెక్షన్ హెడ్ రెడ్డి గారితో మంచి పరిచయం ఏర్పడింది. చాలా సాన్నిహిత్యం పెరిగింది. ఆయన్ని ‘గురువుగారూ’ అనేవాడు. ఆయనా ఇతన్ని అభిమానంతో చూసేవాడు.
ఆరోజు ప్రమోషన్ ఫలితాలు తెలిశాయి. విశ్వానికి మళ్ళీ ప్రమోషన్ తప్పిపోయింది. అది ఆరోసారి! అతని బాధ వర్ణనాతీతం..తన చవటతనం మరోసారి నలుగురికీ తెలిసిందనే ఆవేదన. సహోద్యోగుల సానుభూతి మరీ ఇబ్బందిగా ఉంది. మధ్యాహ్నం లంచ్ టైమ్ అయ్యాకా రెడ్డిగారు అతని దగ్గరకొచ్చారు. ” ఈ పూట సెలవు పెట్టాను. విశ్వం! నువ్వూ రా, బయటికి పోదాం. మీ వాళ్ళు లేరన్నావు కదూ..”అన్నారు. “అవును., ఇవ్వాళే వస్తారు..రాత్రి ఎనిమిది గంటల రైల్లో ” అన్నాడు విశ్వం. రెడ్డిగారి స్కూటర్ ఓ సినిమాహాలు దగ్గర ఆగింది. “గ్రేట్ ఎస్కేప్ ” ఇంగ్లీష్ సినిమా. జనం పలచగా ఉన్నారు. ఓ మూల కూచున్నారు. కాసేపయ్యాకా రెడ్డిగారు ” సినిమా అయ్యాకా మా ఇంటికి పోదాం. అక్కడినుంచి నిన్ను స్టేషనులో దించుతాను. మాఇంటికి నువ్వెప్పుడూ రాలేదు కూడా.”అన్నారు. విశ్వం మౌనంగా అంగీకరించాడు.సినిమా నడుస్తోంది. రెడ్డిగారే మళ్ళీ అన్నారు, “నాగురించి నీతో చెప్పాలని చాలా సార్లు అనుకున్నాను. కానీ వీలు కాలేదు.” విశ్వం అయనకేసి చూశాడు. ఆయన హలు సీలింగ్ కేసి చూస్తూ,” నేను నోట్లో వెండి చెంచాతో పుట్టినవాణ్ణి. మా నాన్న కలప వ్యాపారం చేసేవాడు. నా అయిదో ఏట నన్ను బళ్ళోవేసిన రోజున మావాళ్ళు బ్యాండ్ మేళంతో కార్లో ఊరేగించి, పిల్లలందరికీ పలకా, బలపం, లడ్డూలతో పాటు తలో రూపాయీ ఇచ్చేరట. అయ్యవార్లందరికీ పట్టు పంచలు పెట్టారట. ఆతరువాత ఏదో ఓ సినిమాలో జరిగినట్టు అంతా పోయింది. నేను వారాలు చేసుకుని ఎస్సెల్సీ పాసైనాను. అయ్యాకా, మద్రాసులో ఒక కంపెనీలో నెలకి పదహారు రూపాయల జీతంతో ఉద్యోగం వచ్చింది. పెళ్ళీ పేరంటాలూ అయ్యాయి. ఒక అమ్మాయీ, ఒక అబ్బాయీ పుట్టేరు. మా ఆఫీసు నాలుగంతస్తుల భవనంలో కింద ఫ్లోర్ లో ఉండేది. ఒకరోజు ఉన్నట్టుండి ఆ భవనం మొత్తం కూలిపోయింది. వందల సంఖ్యలో జనం చచ్చిపోయారు. నేను ఎనభైనాలుగు రోజులు ఆసుపత్రిలో ఉన్నాను. శరీరంలో చాలా ఎముకలు గన్నేరు కొమ్మల్లా విరిగిపోతే అతుకు పెట్టారుట. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈ కంపెనీలో చేరి వేరే అవతారం ఎత్తాను.” రెడ్డిగారు చెప్పడం ముగించారు.విశ్వానికి గుండెలు చిక్కబట్టినట్టయింది. ఆశ్చర్యంగా– సమాధి నుంచి లేచి వచ్చిన శవాన్ని చూసినట్టు ఆయనకేసి చూశాడు.
కాసేపటికి సినిమా అయిపోయింది. అక్కణ్నుంచీ రెడ్డిగారింటికి చేరేరు. కాసేపు కూచున్నాకా, ” రా…ఇల్లు చూద్దువుగాని…” అని ఆయన విశ్వాన్ని లోపలికి తీసుకెళ్లారు. ఒక గదిలో మంచంలో పడుకునున్న ఒకామెను చూపించి,” నా శ్రీమతి” అన్నారు. “ఒంట్లో బాగాలేదా?” అడిగేడు విశ్వం. అదోలా నవ్వి, “ఆమెకి ఐదేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది..” అన్నారు. విస్తుపోయాడు విశ్వం. మరో గదిలోకి చూపించి..”మా అబ్బాయి ప్రభు” అన్నారు. అతను చేతులెత్తి నమస్కారం చేశాడు. బయటికొచ్చాకా చెప్పేరు…” వాడికి నోరూ లేదు., కాళ్లూ లేవు.”అని. విశ్వం మనసంతా కలిచినట్టయింది. గబగబా ముందు గదిలోకొచ్చేశాడు. రెడ్డిగారు కాఫీ కప్పులతో వచ్చారు. కాఫీ తాగుతూ చెప్పేరు. “మా అమ్మాయిని పుట్టింటికి రానివ్వరు..వాళ్ల అత్తగారు. దానికిద్దరు పిల్లలు. మా ఆవిడ దూరపు బంధువు ఓ ముసలమ్మ వండి పెడుతుంది. ఈ ఇంట్లో ఉన్న ఒకే ఒక్క మనిషి ఆవిడే.. మిగిలినవన్నీ జీవచ్ఛవాలు.!” విశ్వానికి దిమ్మ తిరిగిపోయింది.
కాసేపు పోయాకా ఇద్దరూ– విశ్వం భార్య రమనీ, పిల్లల్నీ రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్ కి వెళ్ళేరు. అప్పటికే స్టేషనంతా చాలా గందరగోళంగా ఉంది. ఆ రైలుకి ప్రమాదం జరిగిందనీ, చాలామందికి గాయాలయ్యాయనీ, కొందరు మరణించారనే వార్త అట్టుడికినట్టు ఉడికిపోతోంది. విశ్వానికి కాలూ చెయ్యీ ఆడటం లేదు. రెడ్డిగారు ధైర్యం చెపుతున్నారు. గబగబా బయటికి వచ్చి విశ్వం వాళ్ల ఊరికి టెలిగ్రాం ఇచ్చారు. భయాందోళనలతో, బరువెక్కిన గుండెలతో ఇంటికొచ్చారు. రాగానే ఇంటి వాళ్లబ్బాయి గుమ్మంలోనే ఎదురై ఓ టెలిగ్రాం అందించాడు. “రేపు వస్తున్నాం.., ఈ రోజు రైలు తప్పిపోయింది” –రమ. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు విశ్వం. “తరుగులో మెరుగు అంటే ఇదే..” వేరే సందర్భంలో సత్యం అన్న మాట గుర్తుకొచ్చింది అతనికి. “జీవితం నీకు ఎప్పుడు ఏది ఇస్తుందో దాన్ని స్వీకరించు. అది రాలేదని బాధపడీ, ఇది కావాలని ఆరాటపడీ మనంగా సాధించగలిగేది చాలా స్వల్పం! కాదంటావా?” రెడ్డిగారు అడుగుతున్నారు. కూలిపోతున్న నాలుగు అంతస్థుల భవనం, విరిగిపోతున్న గన్నేరు కొమ్మలే–విశ్వం కళ్ల ముందు మెదులుతున్నాయి. ఆయనకేసి చూశాడు. మహా పర్వతం ముందు గులక రాయిలా తనకి తాను కనిపించాడు.
——++——-
కథలో ఆఖరున రెడ్డిగారితో చెప్పించిన రెండు వాక్యాల ద్వారా రచయిత విహారి గారు జీవితాన్ని అద్భుతంగా నిర్వచించారు. అనుకున్నట్టుగానే ఎల్ల వేళలా జరగకపోగా, అనూహ్య సంఘటనలు
జరగడమే …జీవితమంటే. ఆశించడం (expectation) ఉన్నచోటే–ఆశాభంగమూ (disappointment) ఉంటుంది. నిత్యానుభవంలో అందరూ ఇలాంటివి చూస్తూనే ఉంటారు.
క్షణంలో జారిపోయిన అవకాశాల్లాగే–తృటిలో తప్పిన ప్రమాదాలూ ఉంటాయి. దేనికీ కృంగి పోకూడదు…పొంగిపోకూడదు. ఈ తెలివి కలిగి ఉండడమే–జీవితానికి అర్థం గ్రహించడం అంటే!
అనే భావాన్ని సూచిస్తుంది ఈ “స్ప్రహ” అనే కథ.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏